బీఆర్ఎస్ లోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ...!

by Disha Web Desk 1 |
బీఆర్ఎస్ లోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ...!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖపట్నం ఎంపీగా బరిలోకి దిగి ఓటమి చవిచూసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఇటీవలే బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీఎం కేసీఆర్, ఆంధ్రలో ఆ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే మాజీ జేడీ లక్ష్మీనారాయణను కూడా పార్టీలోకి ఆహ్వనించినట్లు సమాచారం. అయితే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన బీఆర్ఎస్ లో చేరుతారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. తాజాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభత్వం వెనక్కి తగ్గింది. ఇది, తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యల వల్లేనంటూ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా గులాబీ బాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సూచించడం గమానార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని నడిపించేందుకు కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకు గాను అదే సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ మాజీ అధికారి తోట చంద్రశేఖర్‌ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారు.

ఇక మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కేసీఆర్ అయనను బీఆర్ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో యాంకర్.. మీరు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలుస్తోంది.. నిజమేనా అని అడగ్గా.. కాలమే అందుకు సమాధానం చెబుతుందని జేడీ సమాధానమిచ్చారు. అయితే, గతంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. మాజీ జేడీ లక్ష్మీనారాయణను కమలం పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు.

కానీ అధికారంలో వైసీపీలోకి అగ్రనేతలు.. ఢిల్లీలోని కమలం పార్టీ నేతలపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి.. ఆయన చేరికను అడ్డుకున్నారు. కానీ, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణకు.. బీఆర్ఎస్ పార్టీ స్వాగతం పలుకుందా చూడాలి. లేక పక్షంలో మరోసారి వైసీపీ అగ్రనేతలు మళ్లీ రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీ అధినేతపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆయన చేరికను అడ్డుకుంటారా... అనే విషయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read..

గ్రూపుల గోల.. నిరసనల సెగ.. నలిగిపోతున్న నారాయణస్వామి!

Next Story

Most Viewed